TTD Tiruchaanuru Sri Padmavathi Temple AR Technology
తాజా వార్తలు

Published : 19/12/2020 05:32 IST
అమ్మ చెంత..మాట్లాడే బొమ్మ
శ్రీపద్మావతీ పరిణయం చిత్రమాలిక ఏర్పాటు

అమ్మవారి చిత్రాలను స్కాన్ చేసి చూస్తున్న యాత్రికులు
తిరుచానూరు, న్యూస్టుడే: శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. భక్తుల హృదయాలను దోచుకుంటోంది. ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం సమీపంలోని ఉద్యానవనంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా రూపొందించిన శ్రీపద్మావతి పరిణయం ఘట్టాలు భక్తకోటిని ఆకట్టుకుంటున్నాయి. శ్రీపద్మావతి కల్యాణం, అమ్మవారి జననం తదితరం కళ్లముందు కదులుతూ..బొమ్మలు మాట్లాడుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. చదువురాని వారు సైతం స్మార్ట్ఫోన్ ద్వారా గూగుల్ప్లే స్టోర్కి వెళ్లి శ్రీపద్మావతి పరిణయం యాప్ను డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేస్తే చాలు చిత్రాల్లోని బొమ్మలు చెప్పే మాటాలు వినొచ్ఛు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉద్యానవనంలో శ్రీపద్మావతి పరిణయం ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది తిలకించేందుకు అవకాశం ఉంటుందని తితిదే భావించింది. అందుకు అనుగుణంగా ఏడాది క్రితం ఉద్యావనంలో శ్రీపద్మావతి పరిణయం ఘట్టాలకు సంబంధించిన 31 వినాయిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఆకాశరాజుతో ప్రారంభమయ్యే చిత్రాలు… అమ్మవారి కల్యాణంతో ముగుస్తాయి. ఒక్కొక్క బోర్డుకు ప్రత్యేక బార్కోడ్ను కేటాయించారు. ప్రతి బోర్డు వద్ద ఆరు అడుగుల దూరం నుంచి బార్కోడ్ను స్కానింగ్ చేసిన వెంటనే చిత్రాల్లోని బొమ్మలు మాట్లాడుతూ బుల్లితెరపై కనిపిస్తాయి. ఒక్కొక్క బోర్డుపైన ఒక చిత్రానికి సంబంధించి సుమారు 20 నుంచి 40 సెకండ్ల వరకు కథాంశం ఉంటుంది. వీటిని వినే సమయంలో హెడ్ఫోన్లు వాడితే నాణ్యమైన, స్పష్టమైన వ్యాఖ్యానం వినొచ్ఛు
రూ.15 లక్షల వ్యయం
తితిదే ధర్మప్రచారంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.15 లక్షల వ్యయం ఖర్చు చేశారు.దిల్లీ, నెల్లూరుకు చెందిన దాతలు ముందుకు వచ్చి వ్యయాన్ని భరించారు. తిరుపతి పూర్వ జేఈవో బి. లక్ష్మీకాంతం చొరవ కారణంగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి జేఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టిన ఆయన అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ శాతం వినియోగించడంపై దృష్టి సారించారు. ఆయన కృషి ఫలితంగా హైదరాబాదుకు చెందిన ఓ సంస్థ దీన్ని రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది.

శ్రీపద్మావతి పరిణయం
